Publish Date: Thu, 23 Apr 2020 (19:03 IST)
Updated Date: Thu, 23 Apr 2020 (19:06 IST)
కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పసుపు కొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలపై శ్రీఅహోబిల జీయర్ స్వామి స్పందించారు. పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చేశారు. ఎవ్వరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు.
కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు.
చెడు ప్రభావాల నుండి బయటపడటానికి వివాహిత మహిళలు పసుపును ఒక దారంతో కట్టుకోవాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ పుకారుతో పసుపు కొనడానికి చాలామంది మహిళలు తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి షాపుల వెంట నిలబడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై అసలు విషయం తెలుసుకున్నారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చినజీయర్ స్వామి కూడా పుకారేనని కొట్టిపారేశారు.