Publish Date: Tue, 27 Aug 2019 (18:20 IST)
Updated Date: Tue, 27 Aug 2019 (18:22 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు. అక్టోబరు రెండో తేదీన విడుదలకానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ప్రస్తుతం 10 దేశాలు... 26 ప్రదేశాల్లో... 'సైరా' విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా శరవేగంగా పనులు సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే, స్వరకర్త అమిత్ త్రివేదీ నేతృత్వంలో ముంబైలో సాంగ్స్ వాయిస్ మిక్సింగ్ జరుగుతోంది. మరోపక్క నేపథ్య సంగీత దర్శకుడు జూలియస్ పేకియమ్ నేతృత్వంలో రీ రికార్డింగ్ కూడా జరుగుతోంది. చెన్నైలో స్పెషల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది.