స్టార్ హీరోయిన్ నయనతారను లక్ష్యంగా చేసుకుని తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు చిత్రాలంటే ఆమెకు ఎందుకో అంత ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత ఇష్టమైతే టాలీవుడ్కే పరిమితం కావొచ్చు కదా వారు అంటున్నారు.
నయనతార ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ, తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ కెరీర్లోనూ దూసుకుపోతున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతోనూ నటిస్తున్నారు.
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి సరసన, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నారు. సాధారణంగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార, ఈ చిత్రానికి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రచారం మొదలుపెట్టడమే ఆమె విమర్శల్లో చిక్కుకున్నారు.
ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి ఆమెతో ఒక ప్రమోషన్ వీడియో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తమిళ సినిమా ప్రమోషన్లో పెద్దగా కనిపించని నయనతార, తెలుగు సినిమా కోసం ఇంత ముందుగా ప్రచారం చేయడంపై కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. "తెలుగు సినిమాలపై అంత ఇష్టమా? అయితే టాలీవుడ్కే షిఫ్ట్ అవ్వొచ్చు కదా?" అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ ట్రోల్స్పై నయనతార తనదైనశైలిలో స్పందించారు. "అనవసర విషయాలకు సమయం వృథా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటాను. ప్రమోషన్లకు వెళ్లాలా, వద్దా అన్నది కూడా నా వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని ఆమె ఘాటుగా బదులిచ్చారు.