తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ఆయనది. హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటారు. గతంలో ఎంతో హుందాగా వుండే ఆయన ఈమధ్య నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా అమర్యాదకర భాషను, అసభ్యకర పదజాలాన్ని వాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎవరో కాదు.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయనను బూతు కిరీటి రాజేంద్ర ప్రసాద్ అని ట్రోల్ చేస్తున్నారు.
అసలు విషయాన్ని చూస్తే... హైదరాబాదులో ఆదివారం నాడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో హాస్య నటుడు అలీని ఉద్దేశిస్తూ... ఎక్కడ ఆ లం- కొడుకు అంటూ అసభ్యకర పదజాలం వాడారు. దీనితో కార్యక్రమానికి వచ్చినవారంతా షాక్ తిన్నారు.
కానీ రాజేంద్ర ప్రసాద్ అదేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఇబ్బందికర పదాలను వాడుతూ మాట్లాడారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అని చెప్పుకునే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. అలీకి ఆయనకు బూతులు తిట్టుకునే స్వతంత్రం వుండవచ్చేమో కానీ పబ్లిక్ ఫంక్షన్లప్పుడు ఇలాగేనా మాట్లాడేది అంటూ రాజేంద్ర ప్రసాద్ పైన మండిపడుతున్నారు.