టాలీవుడ్ మన్మథుడుగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జునపై నటి కమిలినీ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన లొకేషన్లో కూడా సహ నటీనటులతో ఎంతో సరదాగా ఉంటాయని వెల్లడించారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక తెలుగు చిత్రంలో తాను పోషించిన పాత్రను తెరపై చిత్రీకరించిన విధానం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని కమలినీ తెలిపారు. ఆ పాత్రను తాను ఊహించుకున్న దానికి, తెరపై చూపించిన దానికి మధ్య చాలా తేడా ఉందని, ఆ అసంతృప్తితోనే తెలుగు సినిమాల్లో నటించడం మానేశానన్నారు. ఆ ఒక్క సంఘటన తనను బాగా బాధపెట్టిందని, అందుకే టాలీవుడ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
 
									
										
								
																	
	 
	అలాగే, తనతో కలిసి పని చేసిన తెలుగు సినిమాల హీరోల గురించి ప్రస్తావించారు. 'నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్గా ఉంటారు. సెట్స్లో సహ నటులతో చాలా సరదాగా ఉంటారు. ఇక శర్వానంద్ విషయానికొస్తే, ఆయన చాలా సహజంగా నటిస్తారు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం గొప్పది. తానొక స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు' అని కమలినీ పేర్కొన్నారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	కాగా, 'ఆనంద్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తొలి సినిమాతోనే అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి కమిలినీ... ఆ తర్వాత 'గోదావరి', 'గమ్యం' వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, దాదాపు దశాబ్ద కాలంగా ఆమె తెలుగు సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	రామ్ చరణ్ హీరోగా 2014లో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో కమలినీ చివరిసారిగా తెలుగు తెరపై కనిపించారు. ఆ తర్వాత తమిళంలో 'ఇరైవి', మలయాళంలో మోహన్ లాల్తో కలిసి 'పులిమురుగన్' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.