హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ గతంలో ఓ చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇల్లువాకిలీ తాకట్టుపెట్టి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ బోల్తాపడటంతో భారీ నష్టాలను చవిచూశారు. ఆ చిత్రం పేరు "బడే మియా.. చోటే మియా". అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్లు కలిసి నటించారు. గత యేడాది వేసవి నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై నిర్మాత జాకీ భగ్నానీ తాజాగా స్పందించారు.
ఈ సినిమా ఫలితం తన జీవితంలో ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పిందన్నారు. ఒక ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మించడమే విజయానికి సరిపోదని ఈ సినిమా విడుదల తర్వాత అర్థమైందన్నారు. మా కంటెంట్లో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేకపోయారో మేము విశ్లేషించుకోవాలి. ప్రేక్షకుల నిర్ణయం ఎపుడూ సరైనదే. వారి తీర్పును తప్పుపట్టకుండా, దీనిని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని అన్నారు.
ఇకపోతే, వసూళ్ల గురించి ఆయన మాట్లాడుతూ, "బాక్సాఫీస్ వద్ద మా చిత్రం పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో మేము పడిన బాధ ఎవరికీ అర్థం కాదు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మా ఆస్తులను తాకట్టుపెట్టడం, అమ్మడం జరిగింది. అయితే, ఇపుడు ఈ విషయాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు" అని అన్నారు.