Varun Sandesh, Jorige Srinivasa Rao, A. Palaniswami, Kushboo Chowdhur
వరుణ్ సందేశ్ సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా వన్ వే టికెట్ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
కుష్బూ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి టీ ఎస్ రావు అతిథిగా విచ్చేశారు.
అనంతరం త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ, వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశాను. అందుకే వరుణ్ సందేశ్కు ఓ హిట్ అవ్వాలన్నదే నా కల. ఈ టికెట్ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా సినిమాకు కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. కుష్బూ, మనోజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు అని అన్నారు.
నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై ఇది మా రెండో చిత్రం. అందరూ మా చిత్రానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ, ఈ మూవీ కథ చాలా అద్భుతంగా ఉండబోతోంది. తమిళ దర్శకుడు పళని ఈ మూవీని చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్తో రూపొందించబోతోన్నారు. 13 ఏళ్ల తరువాత మళ్లీ వరుణ్ సందేశ్తో కలిసి పని చేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నటీనటులు : వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి, మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి తదితరులు