Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్పీ బాలు సంగీత ప్రపంచానికి తీరని లోటు

ఎస్పీ బాలు సంగీత ప్రపంచానికి తీరని లోటు
, శుక్రవారం, 4 జూన్ 2021 (17:40 IST)
balu live show
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎస్పీ బాలు అంటే చాలు..మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు. ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. 
 
జూన్ 4న శుక్రవారం ఎస్పీ బాలు 75వ జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది. ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్' యూట్యూబ్ ఛానల్,  'సంతోషం సురేష్' యూట్యూబ్ చానెల్స్‌లో గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రసారం అయింది.
 
కళాతపస్వి కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు అని అనిపించే లోటును క్రియేట్ చేసిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అది జన్మజన్మలకు ఒక రుణానుబంధంగా ఉండిపోతుంది.’’ అన్నారు.
 
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. రక్తి గీతమైనా, భక్తి గీతమైనా ఏది పాడాలన్నా బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు. ఇప్పటికీ అతని మాటలు నాకు వినిపిస్తుంటాయి. భక్తి పాటలు పెట్టినప్పుడల్లా అతని గొంతు వినిపిస్తుంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతని సంగీతం వింటూనే ఉంటాము.’’ అన్నారు.
 
కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ‘‘బాలు గారి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. ఆయన చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి మనిషి మనమధ్య లేకుండా పోవడం చాలా దురదృష్టం. ఎన్నో గొప్ప పాటలు పాడడమే కాకుండా ఆయన ఏదైనా కార్యక్రమం చేస్తే నిండుగా ఉంటుంది. ఎంజీఆర్ గారికి సాంగ్ పాడాల్సి వచ్చినప్పుడు ఆయనకు జ్వరం వస్తే వేరేవాళ్లతో పాడిద్దామని అంతా అనుకుంటుంటే ఎంజీఆర్ గారు లేదు బాలుయే పాడలని చెప్పారంటే అలాంటి గొప్ప గాయకుడు బాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు అన్నింట్లోనూ ఆయన పాడారు. ఒక పాటను జనంలోకి తీసుకెళ్లాలంటే స్వరం మధురంగా ఉండాలి. అలాంటి స్వరం ఉన్న బాలుగారికి హ్యాట్సాఫ్. ఆయన ఏ హీరోకి పాడినా, ఏ కమెడియన్‌కు పాడినా ఆ హీరోలు పాడినట్లే ఉండేది. అలా ఎలా అనుకరించేవారో కానీ చాలా అద్భుతంగా ఉండేది. చాలా గొప్ప వ్యక్తి. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘బాలు గారి గురించి మాట్లాడడానికి నాకు వయసు, అనుభవం ఏమీ సరిపోవు. ఆయనతో నాకు ఎక్కువ అనుబంధం లేదు. ఎందుకంటే నేను వచ్చేలోపే ఆయన ట్రాకులు పాడి వెళ్లిపోవడం, లేదా ఆన్‌లైన్‌లో పాడి పంపించడం జరిగేది. ఆయనతో ఎక్కువ కలవలేకపోవడాన్ని రిగ్రెట్‌గా ఫీలవుతున్నా. ‘అతడు’ సినిమాకు నాజర్ క్యారెక్టర్‌కు ఆయనతోనే డబ్బింగ్ చెప్పించా. ఆ టైమ్‌లో కమల్ హాసన్ లాంటి స్టార్లకు మాత్రమే ఆయన చెప్పేవారు. కానీ నాకోసమే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎంత సాధించినా చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమా క్రాఫ్ట్  మీద ఉన్న అండర్‌స్టాండింగ్‌తో ఆయన అందరికంటే ప్రత్యేకంగా మారారు. బాలు గారు టాలెంట్ ఒక్కటే కాదు.. ఆయన చాలా ఇంటలిజెంట్. ఆయన ఆఖరి క్షణాల వరకు పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సౌతిండియాలో పాటలు పాడుతున్న దక్షిణాది వారిలో 60 శాతం మంది ఆయన దగ్గరి నుంచి వచ్చినవారే. ఆయన గెలవడమే కాదు.. మన తర్వాతి తరాలను కూడా గెలిపించారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న బాలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’’ అన్నారు.
 
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ..‘‘బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం ‘నేనంటే నేనే’కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. మాది 50 సంవత్సరాల అనుబంధం. ఆయన 16 భాషల్లో 4 వేల పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన కళాకారుడు. అటువంటివాడు మన తెలుగువాడు అవడం మనందరి అదృష్టం.’’ అన్నారు.
వీకే నరేష్ మాట్లాడుతూ..‘‘ఎస్పీ బాలు గారికి మతాలకు, కులాలకు అతీతంగా కోట్లమంది అభిమానులున్నారు. ఆయన ఒక అజాతశత్రువు. నా ఏడో ఏట నుంచి ఆయన పరిచయం. నా సినిమాలకు పాడడమే కాకుండా నేను హీరోగా నటించిన మొదటి సినిమాకు డబ్బింగ్ చెప్పిన దేవుడు. ’’ అని అన్నారు.
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ, బాలు నాకు చాలా మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి సెటిల్ కూడా ఆడుకునేవాళ్ళం. ఆయనతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వైజాగ్ లో స్వరాభిషేకం కార్యక్రమంలో అయన గురించి చెబితే .. వెంటనే వచ్చి నా కాళ్ళకు దండం పెట్టాడు .. వెంటనే లేపి .. నువ్వు సరస్వతి పుత్రుడివి... నీలో సరస్వతి ఉంది.. మేము నీకు దండం పెట్టాలి అని అంటే .. లెద్దూ అంటూ హత్తుకున్నాడు. అయన ఏంతో మంచి మనిషి అన్నారు. 
 
నేను శైలజ అనే సింగర్ ఉన్నానంటే కారణం .. ఆయనే. నేను చిన్నప్పటినుండి ఆయనతోనే పెరిగాను. ఇండస్ట్రీ లో ఎలా నడుచుకోవాలి అన్ని తండ్రిగా చుకున్నారు. ప్రతి విషయంలో ఆయనను చూసే నేర్చుకునేదాన్ని. ఇంతమంది అయన గురించి గొప్పగా మాట్లాడడం నిజంగా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు చాలా విషయాలు ఉన్నాయి.. పంచుకున్నవి. అయన పక్కన లేడన్న దిగులు లేదు నాకు ... ఎప్పుడు నా పాటలో ఉంటాడు .. నా నోట్స్ లో ఉంటాను.. నా మైక్ లో ఉన్నాడు .. నాలోనూ ఉన్నాడు. తాను ఎప్పుడుఅందరికి స్ఫూర్తిగా ఉంటాడు .. నేను కూడా ఆయనలా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటాను.. ఎప్పుడు కూడా నవ్వుతు అందరితో ఆనందంగా గడిపే వారు.. అయన పుట్టినరోజున ఆంజనేయ స్వామి జయంతి రావడం .. చాలా సంతోషంగా ఉంది .. ఆంజనేయస్వామి గుడి ఎక్కడ కనిపించిన మొక్కేవారు.. అయన ఎప్పటికి , ఇప్పటికి మనతోనే ఉంటారు. 
 
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ,  నేను చేసిన మొదటి సాంగ్ ని బాలుగారితో పాడించడం నాకు మరచిపోలేని అనుభూతి. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన దేవి సినిమాలో ఓ సాంగ్ ని ఫస్ట్ సాంగ్ ని బాలుగారి స్టూడియో లో రికార్డ్ చేసాం. అప్పటికే బాలుగారిని డాడీ తో చూస్తూండేవాణ్ణి. బాలుగారు మా ఇంటికి వస్తున్నారంటే పెద్ద పెద్ద కార్లు వచ్చేవి.. హంగామా ఉండేది.. అది నాకు చాలా ఇగ్జైట్ గా ఉండేది. ఆ తరువాత ఆయనతో చాలా పాటలు పాడించాను. నా పాటల విషయంలో చాలా అభినందించేవారు. నాకు బాలుగారిని చూసినప్పుడల్లా సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది.. అలాగే చిరంజీవి గారు ,కమల్ హాసన్ ఇలా వాళ్ళను ఎప్పుడు చుసిన కొత్తగా అనిపిస్తుంది. బాలుగారు అంతే అయన ఎప్పుడు చుసిన కొత్తగానే కనిపిస్తారు. మా ఫ్యామిలీతో ఆయనకు చాలా అనుబంధం ఉండేది. గొప్ప గొప్ప వాళ్లలో ఓ చిన్నపిల్లాడు ఉంటాడు.. అది బాలుగారిలో చూసాను. ఆయన గ్రేట్ లెజెండరీ సింగర్. ఆయనతో పనిచేయడం గొప్ప అదృష్టాంగా భావిస్తున్నాను. అయనను నిజంగా మిస్ అవుతున్నాం. లవ్ యు బాలుగారు అన్నారు. హీరో నాని, హీరో శ్రీకాంత్,  సురేష్ బాబు,  అనంత్ శ్రీరామ్, భువనచంద్ర, సి కళ్యాణ్ ఆచంట గోపినాధ్ ఇలా పరిశ్రమకు సంబంధించి మరెందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`విక్రమ్'లోని పడిపోయా పడిపోయా పాట విడుదల