ప్రముఖ ఆన్లైన్ సినిమా టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు విరుచుకుపడ్డారు. సినిమా టిక్కెట్లు విక్రయించే 'బుక్ మై షో' వంటి యాప్లు కూడా సినిమాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారి వల్ల చిత్రపరిశ్రమకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పరిశీలిస్తే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని అలాంటపుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు. టిక్కెట్ కొనుగోలు చేసే సమయంల ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
మీరు కూడా సినిమా మీదే ఆదారపడి వ్యాపారం చేస్తున్నారు కదా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ 'బుక్ మై షో' యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఈ రేటింగ్స్ కారణంగా సినిమా నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బన్నీవాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి.
ఇదిలావుండగా, బన్నీవాసు నిర్మాతగా మిత్రమండలి అనే కొత్త చిత్రాన్ని నిర్మించగా, ఇందుల ప్రియదర్శి, నిహారిక, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.