బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు ఒకయేడాది జైలుశిక్ష పడింది. ఈ మేరకు విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (కాఫిఫోసా) ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులైన తరుణ్ కొండారు రాజు, సాహిల్లలకు కూడా ఇదే శిక్ష విధించినట్లు బోర్డు తెలిపింది.
అక్రమ రవాణాకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో శిక్షా కాలంలో వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తెలిపింది. దీంతో ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సివుంది. ఈ కేసులో ప్రతి మూడు నెలలకు ఒకసారి విచారణలు జరుగుతాయని పేర్కొంది. ఇలా ఏడాది వరకు కొనసాగుతాయని వెల్లడించింది.
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్ఎస్ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ సమయంలో ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేసి రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇక, అక్రమంగా బంగారం తరలించడంలో రన్యారావు సహచరులైన తరుణ్ కొండూరు రాజు, సాహిల్ జైన్లు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారిని కూడా అధికారులు అరెస్టు చేశారు.