Publish Date: Wed, 20 Mar 2019 (18:05 IST)
Updated Date: Wed, 20 Mar 2019 (18:06 IST)
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ. ఇచ్చిన పాత్రకు తగు న్యాయం చేయడంలో బ్రహ్మాజీ తనకు తానే సాటి. తాజాగా తనకు జరిగిన ఓ సంఘటనను బ్రహ్మాజీ గుర్తు చేసుకున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్తో కలిసి నటించాడు.
ఆ చిత్ర షూటింగ్ సమయంలో బ్రహ్మాజీ రామ్ చరణ్ వద్దకు వెళ్లి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం ఇంతవరకు రాలేదని, తన మనసులోని కోరిక అలాగే మిగిలిపోయిందని, చిన్న పాత్ర దొరికినా చాలనుకునేవాడని, ఇదే విషయాన్ని రామ్ చరణ్కి చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న చరణ్ రంగస్థలం షూటింగ్ పూర్తయిన తర్వాత బ్రహ్మాజీని సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దగ్గరకు తానే స్వయంగా తీసుకువెళ్లి, తనకు ఏదైనా రోల్ ఉంటే చూడండి అని అడిగాడట.
చరణ్ అతడిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియదని, అలాగే సురేందర్ రెడ్డిని చరణ్ అలా అడిగే సరికి ఒక్కసారిగా బ్రహ్మాజీ షాకయ్యాడట. ఆ విధంగా సైరా సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చిందని బ్రహ్మాజీ చెప్పాడు. చిరంజీవి గారితో నటించాలన్న తన చిరుకాల కోరిక తీరిందని, అంతేకాకుండా ఈ సినిమా కోసం 80 రోజులు కేటాయించాడట.
వాస్తవానికి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇన్ని రోజులు ఒక సినిమాకు తీసుకుంటే రెమ్యునరేషన్ తగ్గిస్తారు. అయితే చరణ్ మాత్రం తన రెమ్యూనరేషన్ని పెంచాడని బ్రహ్మాజీ చరణ్పై ప్రశంసల జల్లు కురిపించాడు.