Publish Date: Sat, 02 Sep 2023 (19:32 IST)
Updated Date: Sat, 02 Sep 2023 (19:41 IST)
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రం శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని.. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగామ, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.