Publish Date: Thu, 08 Sep 2022 (11:52 IST)
Updated Date: Thu, 08 Sep 2022 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండాను ఎగురవేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను పక్కాగా అమలు చేస్తుంది. ఇందులోభాగంగా వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు గాలం వేస్తుంది.
ముఖ్యంగా, సినీ గ్లామర్ను కూడా వాడుకోవాలని భావిస్తుంది. ఈ కోవలో ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత వంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంది. సహజ నటి జయసుధ కూడా ఆ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో తాజాగా టీడీపీకి టాటా చెప్పేసిన సినీ నటి దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఆమె తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని శమీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి వెళ్లిన దివ్యవాణి ఆయనతో ఏకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఈటల పార్టీలోకి ఆహ్వానించగా, ఆమె కూడా సముఖుత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.