Publish Date: Wed, 04 Jan 2023 (09:01 IST)
Updated Date: Wed, 04 Jan 2023 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆ ర్టీసీ) శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ కోసం తమ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్రా ప్రయాణికుల కోసం పది స్లీపర్ బస్సులు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీవర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నారు.
ఈ బస్సులను హైదరాబాద్ నగరం నుంచి కాకినాడ, విజయవాడ మధ్య నడుపనున్నట్టు తెలిపింది. తొలి బస్సు బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ బస్టాప్ నుంచి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీవీ సజ్జనార్లు ప్రారంభిస్తారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతి రోజూ ఉదయం 9.30, 10.45, 11.45, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15, అర్థరాత్రి 12.00, 12.45 గంటలకు బయలుదేరుతాయి.
అలాగే, హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రతి రోజూ 7.75, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయని తెలంగాణ ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.