Publish Date: Sun, 12 Jul 2020 (17:43 IST)
Updated Date: Sun, 12 Jul 2020 (17:47 IST)
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ నాయకులు పోలీసుల సమక్షంలో చేసిన దాడి కెసిఆర్ రాక్షస పాలనను తలపిస్తోందని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు.
కెసిఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి భూకబ్జాలకు మారుపేరుగా మారారని దీనిపై అరవిందు ప్రశ్నిస్తే దాడులు చేయడం గర్హనీయమని తీవ్రంగా ఖండిస్తున్నామని బాబురావు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ సభ్యుడు స్థాయి నాయకుడికే రక్షణ కల్పించలేని పోలీసులు దాడిని ముందుండి చేయించడం అమానుష చర్యగా అభివర్ణించారు.
బిజెపి కార్యాలయంపై, ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిపై విచారణ జరిపించి వరంగల్ ఎమ్మెల్యే లు నరేందర్ వినయభాస్కర్ లపై కేసు నమోదు చేయాలని, దాడి జరుగుతున్న సమయంలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.