Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రైన్ హైజాక్ కేసు ..టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ

ట్రైన్ హైజాక్ కేసు ..టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ
, బుధవారం, 24 జులై 2019 (08:16 IST)
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాజీపేటలో జరిగిన ట్రైన్ హైజాక్ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే కోర్టు బుధవారం తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నిందితుడిగా ఉండగా, వరంగల్ కు చెందిన మరో 18 మంది టీఆర్ఎస్, బిజెపి నేతలు సహ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఏప్రిల్ 14, 2011లో కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద  ప్రయాణికులతో వెళుతున్న కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ ను టీఆర్ఎస్ నేతలు నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు రైలును ఆపగా  దాదాపు పన్నెండు గంటలపాటు రైలు అక్కడే నిలిచిపోయింది. దీనిని తీవ్ర నేరంగా పరిగణించిన రైల్వే శాఖ ఆందోళనకారులపై రైలు హైజాక్ కేసు నమోదు చేసింది. ఈ ఆందోళనను ముందుండి నడిపించారు అంటూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ ఎ1 నిందితుడిగా పేర్కొన్నారు. 
 
ఈయనతో పాటు మరో 18 మందినీ సహ నిందితులుగా ప్రస్తావించారు.  వీరిలో ఇద్దరు స్థానిక బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా వరంగల్ లోని రైల్వే కోర్టులో విచారణ సాగుతోంది. ఇటీవలే ఈ కేసును నాంపల్లిలోని కోర్టుకు బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ నెల 24న బుధవారం ఉదయం 10 గంటలకు నాంపల్లి రైల్వే కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. 
 
రైలు రోకో లాంటి సంఘటనలు  తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కేసుల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్,  మాజీ ఎంపీ కవిత తో పాటు అనేకమంది సీనియర్ నేతలు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నవారే.  తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ సమయంలోని అనేక కేసులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ముఖ్యమంత్రి, మంత్రులపై ఉన్న రైల్వే కేసులు సైతం గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొట్టివేశారు. 
 
కానీ రైలు హైజాక్ తీవ్రమైన నేరం కావడంతో ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు నిరూపితం అయితే ఈ కేసులో  ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. బుధవారం నాంపల్లిలోని రైల్వే కోర్టు వెలువరించబోయే తీర్పుపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ తీర్పు నేపథ్యంలో వరంగల్ నగరంలో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలోకి నటి ప్రియారామన్‌