Publish Date: Wed, 16 Mar 2022 (11:12 IST)
Updated Date: Wed, 16 Mar 2022 (11:17 IST)
కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మితం కానుంది. నగరం నడి మధ్యలో టీటీడీ ఆలయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పదెకరాల భూమిని కేటాయించారు. దీనికోసం అనుమతి పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్తో పాటు టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జి.వి. బాస్కర్ రావులకు అసెంబ్లీలో అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కరీంనగర్ పట్టణం మధ్యలో పదెకరాల్ని కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తిరుమలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతిఫలించేలా అధ్బుతమైన వేంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఏడాదిన్నరలో పూర్తయ్యే కరీంనగర్ శ్రీనివాసుని ఆలయంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భక్తులకు ఆ భగవంతుడు మరింత చేరువవుతాడన్నారు మంత్రి గంగుల కమలాకర్.