Publish Date: Fri, 31 Mar 2023 (12:59 IST)
Updated Date: Fri, 31 Mar 2023 (13:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నాయి. నిజామాబాద్లోని తన హాస్టల్లో ఉరేసుకుని ఎంబీబీఎస్ తృతీయ సంవత్సర విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో ఇదే హాస్టల్లో హర్ష అనే విద్యార్థి కూడా ఇదే విధంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
స్థానికంగా ఉండే ప్రభుత్వ వైద్య కాలేజీలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న సనత్ అనే వైద్య విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మృతుడిని స్వస్థలం పెద్దపల్లి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వైద్య విద్యార్థి మృతదేవాన్ని స్వాధీన చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే, గత నెలలో కూడా ఇదే హాస్టల్లో హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థుల్లో భయాందోళనలు రేపుతుంది. మరోవైపు, సనత్ ఆత్మహత్యపై ప్రిన్సిపాల్ ఇందిర విచారం వ్యక్తం చేశారు. సనత్ స్నేహశీలి అని తెలిపారు. గత రాత్రి వరకు గదిలో చదువుకున్న సనత్.. ఉదయానికి ఇలా శవమై తేలడాన్ని తట్టుకోలేకపోతున్నట్టు ఆమె వెల్లడించారు.