Publish Date: Tue, 14 Dec 2021 (10:09 IST)
Updated Date: Tue, 14 Dec 2021 (10:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా, రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే రెండు రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే, పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించింది. ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు తెలంగాణా వైపు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి వేళ పొడి వాతావరణం ఉంటుంది, రాత్రివేళ భూవాతావరణం త్వరగా చల్లబబడుతుందని ఈ కారణంగా చలి తీవ్ర పెరుగుతుందని తెలిపింది.
అదేసమయంలో ఉదయం పూట పొగ మంచు కురుస్తుందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అధనంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వివరించారు. సోమవారం కుమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, వచ్చే పది రోజుల్లో ఇది 10 కంటే తక్కువ డిగ్రీల్లో నమోదు కావొచ్చని వివరించారు.