Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ఇకపై ప్రైవేటులో కూడా కరోనా చికిత్స

తెలంగాణాలో ఇకపై ప్రైవేటులో కూడా కరోనా చికిత్స
, సోమవారం, 15 జూన్ 2020 (13:40 IST)
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడినవారికి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికిత్సకు ధరలను నిర్ణయించారు. 
 
ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9,000 వసూలు చేయాలని కోరారు. 
 
అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. 
 
కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.
 
తెలంగాణా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత???
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 237 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఏకంగా 195 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే తెలంగాణాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,974కు చేరుకున్నాయి. 2,377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ముగ్గురు చనిపోవడంతో, రాష్ట్రంలో మరణాల సంఖ్య 185కి పెరిగింది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ వెల్లడి కాలేదు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న వేళ, రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స 9 జిల్లా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నా, అక్కడ ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో లేరనే విమర్శలు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 శాతం వరకూ డాక్టర్ల కొరత ఉందని వైద్యాధికార వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్‌లోని ఎంజీఎంలతో పాటు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, ఖమ్మం, సూర్యాపేట జిల్లా ఆసుపత్రులు కోవిడ్ 19 ఆస్పత్రులుగా మార్చారు. ఇందులో నిజామాబాద్ ఆసుపత్రిలో 200 బెడ్లను కరోనా రోగులకు కేటాయించారు. 
 
అయితే, ఇక్కడ 304 మంది వైద్యులు పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం కేవలం 104 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రిమ్స్‌లో కరోనా రోగుల కోసం 100 బెడ్లు ఉండగా, ప్రస్తుతం 9 మందికే చికిత్స జరుగుతోంది. ఇక్కడ కేవలం ఐదుగురు సీనియర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏంటన్నది వైద్య వర్గాలకే అంతుచిక్కడం లేదు. అలాగే, మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుందనే విమర్శలు లేకపోలేదు. 
 
అలాగే, ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే, 100 బెడ్లు కరోనా రోగుల కోసం ఉండగా, 50 శాతం వైద్యుల కొరత ఉంది. వరంగల్ ఎంజీఎంలో 200 బెడ్లకుగాను ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 1,420 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 870 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నల్గొండ జీజీహెచ్‌లో 25 సాధారణ, 10 ఐసీయూ బెడ్లను వైద్యాధికారులు సిద్ధం చేశారు.
 
మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో 111 మంది పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం 26 మంది మాత్రమే ఉన్నారు. కాగా, ఈ ఆసుపత్రుల్లో లెవల్ 1, లెవల్ 2 కరోనా పేషంట్లకు మాత్రమే చికిత్స చేసే వీలుంది. పరిస్థితి విషమించి, వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైతే, ఇక్కడి వారు చేతులెత్తేసి, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తారింటికి వెళుతూ నదిలో దూకేసిన నవవధువు.. ఎక్కడ?