Publish Date: Mon, 16 Aug 2021 (10:25 IST)
Updated Date: Mon, 16 Aug 2021 (10:27 IST)
పంట రుణాల మాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీ నేపథ్యంలో విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్.. ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది. ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది.
స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2 వేల5 కోట్ల 85 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభత్వం.
50 వేల వరకు రుణాలున్న 6 లక్షల 6 వేల 811 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. 25 వేల 100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ రన్ పూర్తయింది. ఈనెల 30 వరకు 25 వేల నుంచి 50 వేల వరకు రుణాలున్న రైతులకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం.
రైతుబంధులా గుంట భూమి నుంచి ఎకరా వరకు, ఎకరా నుంచి 2 ఎకరాలు, 2 నుంచి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లుగానే.. 25, 26, 27 వేల చొప్పున రుణాలు మాఫీ అవుతాయి. ఈ మేరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం.
రైతుబంధు తరహాలోనే వందశాతం విజయవంతంగా పంట రుణాలు మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్లైన్ ద్వారా అమలు చేసేందుకు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించింది. 2014 నుంచి 2018 వరకు మొత్తం 16 వేల 144 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.