Publish Date: Mon, 26 Jul 2021 (09:51 IST)
Updated Date: Mon, 26 Jul 2021 (09:54 IST)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం వేచి చూస్తున్నవారికి శుభవార్త. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నవారికి కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన పూర్తిఅయ్యింది.
3,04,253 కుటుంబాలు కొత్తగా రేషన్కార్డుకు అర్హులుగా యంత్రాంగం గుర్తించింది. ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు అర్హులకు ఈ నెల 26 నుంచి నెలాఖరువరకు కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.
లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధ్రువీకరణపత్రం అందిస్తామన్నారు. ఆ తర్వాత త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్కార్డు అందిస్తామని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఆయన నూతన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. వీరందరికీ ఆగస్టు నుంచి రేషన్ బియ్యం అందించనున్నారు.