Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : ఓటు ఎలా వేయాలో తెలుసా?

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : ఓటు ఎలా వేయాలో తెలుసా?
, బుధవారం, 10 మార్చి 2021 (09:43 IST)
తెలంగాణాలో రెండు పట్టభద్రుల స్థానాకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,19,367 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ ఎన్నికలు, గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు పూర్తి భిన్నం. ఎందుకంటే 93 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్ సైతం దినపత్రిక పరిమాణంలో పెద్దదిగా ఉంది. పైగా ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. 
 
ఇలాంటి సందర్భంలో ఓటు ఎలా వేయాలి? పెద్దదిగా ఉన్న బ్యాలెట్ పత్రాన్ని.. ఎలా మడిచి పెట్టెల్లో వేయాలి? అనే అనుమానాలు ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అందుకే జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమానికి.. మహబూబ్ నగర్ జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో... ఉద్యోగ సంఘాలు, మీడియా, న్యాయవాదులు, పట్టభద్రులకు.. బ్యాలెట్ పేపర్ పై అవగాహన కల్పించారు.
 
పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చే ఊదారంగు స్కెచ్ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదల్చుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బాక్సులో '1' వేయాల్సి ఉంటుంది. తదుపరి అభ్యర్థుల ఎంపికను 2,3,4,5.... అంకెలతో ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న బాక్సులో వేయాలి. 
 
బ్యాలెట్​ పత్రం చెల్లుబాటు కావటానికి... మొదటి ఎంపిక సంఖ్య '1' అత్యంత ఆవశ్యకం. మిగిలిన అభ్యర్థుల ఎంపికను.. ఓటరుకు ఇష్టమున్న క్రమంలో ఎంపిక చేసుకుని నంబర్లు వేయాల్సి ఉంటుంది. సంఖ్యలను అంతర్జాతీయ ప్రామాణిక, భారతీయ లేదా రోమన్​ విధాన ద్వారా లేదా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ ఇతర భాషల అంకెల ద్వారా అయిన వేయవచ్చు. మొదటి ప్రాధాన్య ఓటు వేయకుండా 2ఆపై సంఖ్యలతో ఓటు వేస్తే... ఆ ఓటు చెల్లదని అధికారులు స్పష్టం చేశారు.
 
ఈ మండలి ఎన్నికలలో ఓటు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని కలెక్టర్ వెంకట్రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్నంత మాత్రాన.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఉండదని, నమోదు చేసుకున్న వారికే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని.. పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం కోసం ఆరుగురు పోటీ!