Publish Date: Wed, 06 Jan 2021 (10:30 IST)
Updated Date: Wed, 06 Jan 2021 (10:32 IST)
పొట్టలో కత్తెరలను వుంచి ఆపరేషన్ చేసేసే వైద్యులు గురించి వినే వుంటాం. తాజాగా ఓ బాలుడు ఎల్ఈడీ బల్బును మింగేశాడు. శ్వాసనాళంలో ఊపిరితిత్తుల సమీపంలో ఆ చిన్న బల్బు చిక్కుకుపోయింది. అందుకనే అతడు శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. దగ్గుతో ఆయాసపడ్డాడు. శ్వాస సమస్యలు, దగ్గుతో అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎలాంటి సర్జరీ లేకుండా నోటి ద్వారానే ఆ బల్బును బయటకు తీశారు. హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ (9) అనే బాలుడు ఆదివారం ఎల్ఈడీ బల్బును మింగేశాడు. స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో చిన్న బల్బును నోట్లో పెట్టుకున్నాడు. ఆడుకుంటూ..ఆడుకుంటూ.. తనకు తెలియకుండానే పొరపాటున దాన్ని మింగేశాడు. బయటకు తీసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు.
అదే రోజులు కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్ తీస్తే బాడీలో ఎల్ఈడీ బల్బు కనిపించింది. వైద్యులు అతడికి పీడియాట్రిక్ రిజడ్ బ్రాంకోస్కోపి చేసి ఎల్ఈడీ బల్బును బయటకు తీశారు. కేవలం 10 నిమిషాల్లోనూ ఇది పూర్తయింది. అనంతరం అదే రోజు బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.