Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ కాంగ్రెస్ రథసారధిగా జీవన్ రెడ్డి!

తెలంగాణ కాంగ్రెస్ రథసారధిగా జీవన్ రెడ్డి!
, మంగళవారం, 5 జనవరి 2021 (08:56 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేసినట్టు సమాచారం. జీవన్ రెడ్డి పేరున ఆమె నేడో రేపో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డేనంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, సోమవారం సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. రేవంత్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.
 
అయితే ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌కే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే యోచనలో అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని తోసిపుచ్చడమూ లేదు. 
 
జీవన్‌ రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్‌ తదితర నేతల పేర్లను ఆమె పరిశీలించి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేదలను జగనన్న దత్తత తీసుకున్నారు: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి