Publish Date: Sat, 04 Sep 2021 (11:10 IST)
Updated Date: Sat, 04 Sep 2021 (11:11 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వచ్చే 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే, ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
మరోవైపు గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.