Publish Date: Mon, 13 Jun 2022 (18:19 IST)
Updated Date: Mon, 13 Jun 2022 (18:21 IST)
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రెండు రోజుల్లో తెలంగాణాలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఫలితంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తెలంగాణాలోకి ప్రవేశించాయని, పాలమూరు జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుమురులు, మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.
నిజానికి ఈ నెల 8వ తేదీన తెలంగాణాలోకి రుతుపవాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, కర్నాటక, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రుతుపవనాల గమనానికి ఆటంకం కలిగింది.
జూన్ రెండో వారంలో కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండడం కూడా రుతుపవనాల ముందంజకు ప్రతిబంధకంగా మారాయని నిపుణులు విశ్లేషించారు.