Publish Date: Wed, 24 Feb 2021 (15:35 IST)
Updated Date: Wed, 24 Feb 2021 (15:37 IST)
మోసం చేసేది పురుషులే కాదు... స్త్రీలలోనూ వున్నారనేందుకు మరో ఉదాహరణ. పెళ్లి చేసుకుంటానంటూ ఓ బడా వ్యాపారవేత్తను నమ్మించి వంచించి అతడి దగ్గర్నుంచి సుమారు రూ. 11 కోట్ల మేర లాగేసిందా మాయలేడి. తను ఓ ఐపిఎస్ అధికారినని కూడా వ్యాపారిని నమ్మించి నట్టేట ముంచింది. చివరకు బాగోతం బయటపడటంతో కటకటాలపాలైంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రుతి సిన్హా అనే మహిళ తను ఓ ఐపిఎస్ అధికారినంటూ వీరారెడ్డి అనే వ్యాపారికి పరిచయం చేసుకుంది. మనిషి హుందాగా వుండటమే కాకుండా, ప్రేమ కూడా వలకబోసింది. దీనితో వీరారెడ్డి ఆమె మాటలు నమ్మేశాడు.
అదే అదనుగా వీరారెడ్డి నుంచి తనకు డబ్బు అవసరం వుందని చెబుతూ పలుసార్లు రూ. 11 కోట్లు అతడి నుంచి తీసుకుంది. పెళ్లి మాటెత్తితే మాత్రం తప్పించుకుంటుంది. ఐతే వీరారెడ్డి ఆమెపై దృష్టి సారించి చూడటంతో ఆమె మోసగత్తె అని తేలింది. దీనితో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేక్ ఐపిఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.