Publish Date: Sat, 30 Nov 2019 (18:05 IST)
Updated Date: Sat, 30 Nov 2019 (18:08 IST)
వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని, నడిరోడ్డుపై కాల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే నిందితులను షాద్ నగర్ తహశీల్దార్ ముందు హాజరుపరిచారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పజెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని చంపేస్తామంటూ అక్కడకు చేరుకున్న ప్రజలను ఆవేశంతో ఊగిపోయారు.
అయితే మద్యాహ్నం నుంచి హైడ్రామా నెలకొనడంతో సాయంత్రానికి చాకచక్యంగా పోలీసులు నిందితులను తప్పించారు. మొత్తం నాలుగు వాహనాలను కాన్వాయ్గా ఏర్పాటు చేసుకుని నిందితులను వాహనంలో సీట్ల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. దీంతో అక్కడ ఉన్న జనానికి నిందితులను తీసుకెళుతున్నారో లేదో అర్థం కాలేదు.
చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ పనిచేయకూడదని, చట్టానికి లోబడే ప్రతి ఒక్కరు ఉండాలని పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. నిందితులను జనం చంపేసే అవకాశం ఉందని పోలీసులు భావించి వారిని చాకచక్యంగా తరలించారు. పోలీసుల తీరుపై జనం మండిపడుతున్నారు. చర్లపల్లి జైలుకు నిందితులను తరలించారు.