Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాడిస్ట్ లవర్, తను చేసుకోడు ఇంకొకర్ని చేసుకోనివ్వడు, యువతి ఆత్మహత్య

శాడిస్ట్ లవర్, తను చేసుకోడు ఇంకొకర్ని చేసుకోనివ్వడు, యువతి ఆత్మహత్య
, గురువారం, 23 జులై 2020 (15:24 IST)
తాను చేసుకోడు. వేరే సంబంధాలు చూస్తుంటే చెడగొడతాడు. ఈ యువకుడి శాడిజాన్ని భరించలేక గడ్డి మందు తాగి యువతి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. నన్ను క్షమించండి అమ్మా.. నాన్న! నేను ప్రేమించిన రంజిత్ పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు. నిన్ను పెళ్లిచేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని బెదిరిస్తూ మానసికంగా నాకు నరకం చూపుతున్నాడు.
 
అమ్మా.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను హ్యాపీగా ఉండనివ్వడు. నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేవడం నాకు ఇష్టం లేదు. నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్ బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మిస్ యు మై ఫ్యామిలీ. మిస్ యూ మామ్ అండ్ డాడీ అంటూ ఉమ అనే యువతి సూసైడ్ నోట్, రాసి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
 
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సారంగాపూర్ ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) రెండేళ్ల కిందట సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్‌లో తన క్లాస్‌మేట్ అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయ్యేవరకు వారి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగింది.
 
ఆ తర్వాత ఉమ రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతోంది. ఈ క్రమంలో కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఉమ, రంజిత్‌ను కోరుతోంది. అతను అంగీకరించకుండా పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి కొత్తపల్లి లక్ష్మి, తండ్రి సత్తయ్యలకు తెలిపింది. ఇద్దరి కులాలు వేరైనా తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వారు రంజిత్‌ను ప్రాధేయపడ్డారు.
 
కానీ అతను వినలేదు. దీంతో బాధిత కుటుంబీకులు ఉమకు వివాహం చేయాలని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్ వాటిని చెడగొడుతూ ఉమకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళికొడుకుని ముస్తాబు చేసిన బంధువులు, పెళ్ళికొడుక్కి కరోనావైరస్, చివరకు?