Publish Date: Sun, 22 May 2022 (09:41 IST)
Updated Date: Sun, 22 May 2022 (09:31 IST)
రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమ ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని, దీనికితోడు బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదలుతున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటే, శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. అలాగే, బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్లో 9.5 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శనివారం కుమరంభీం జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.