Publish Date: Mon, 17 May 2021 (09:36 IST)
Updated Date: Mon, 17 May 2021 (09:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు పగటిపూటే నరకం చూపిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలుచేస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరసరుకులు కొనుగోలు చేసేందుకు అనుమతించారు. పైగా, ప్రజా రవాణా కూడా నాలుగు గంటల సమయమే కేటాయించారు. ఆ తర్వాత ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణిలులు కూడా స్టేషన్లకు రావడానికి వీల్లేదు. దీంతో రైలు ప్రయాణిలు రాత్రి 11 గంటలకు రైలు బయలుదేరుతుందని తెలిసినా.. ఉదయం 10 గంటల లోపే స్టేషన్కు చేరుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు దాదాపు 13 గంటల పాటు స్టేషన్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం తెలంగాణాలో లాక్డౌన్ అమలవుతోంది. దీంతో ఉదయం 10 గంటలలోపే ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు, రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తుండడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
నాంపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్ప్రెస్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. అయితే, ఆ సమయంలో రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం 10 గంటల లోపే రైల్వే స్టేషన్కు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు.