Publish Date: Thu, 06 Jan 2022 (12:44 IST)
Updated Date: Thu, 06 Jan 2022 (12:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తలతో పాటు.. ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణంగా అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అనే ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆయన పేరును ఏ2గా చేర్చారు.
ప్రస్తుతం ఈయన రాఘవేంద్ర రావు పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇందులో రామకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్ర రావు కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ఎంతో ప్రమాదమని ఆయన ఎదగనివ్వొద్దని ప్రాధేయపడ్డారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాద్కు తీసుకుని రావాలని కోరారంటూ బోరున విలపించారు.
తాను ఒక్కడినే ఆత్మహత్య చేసుకుంటే తన భార్యా, పిల్లలు అనాథలై పోతారని, వారిని ఇలాంటి దుర్మార్గులు వదిలిపెట్టరని అందుకనే తనతోపాటు వారినీ తీసుకెళ్తున్నానని చెప్పారు. పైగా అప్పుల్లో కూరుకునిపోయిన తనను తన తల్లి, సోదరి కూడా కక్షసాధించారని రామకృష్ణ ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, వనమా రాఘవేంద్ర రావు ఈ కేసులో ఏ2గా ఉన్నారు.