Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ పార్టీకి లేనంత మంది స్వచ్ఛంద సైనికులు టీఆర్ఎస్ పార్టీకి: కేటీఆర్

ఏ పార్టీకి లేనంత మంది స్వచ్ఛంద సైనికులు టీఆర్ఎస్ పార్టీకి: కేటీఆర్
, గురువారం, 29 అక్టోబరు 2020 (08:08 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 'టెక్ సెల్' కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 
 
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యకలాపాలను 2013 నుండి పార్టీ టెక్ సెల్ నిర్వహిస్తుంది. పార్టీ సభ్యత్వ డేటాబేస్, కమిటీల డేటా బేస్, ఇతర సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, పార్టీ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ నిర్వహణ టెక్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో టెక్ సెల్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. ఈ నూతన కార్యాలయం టెక్ సెల్ కార్యకలాపాలు మరింత మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది అన్నారు. 
 
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్లుగా  క్రిషాంక్ మన్నె, జగన్ పాటిమీది, సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి వ్యవహరిస్తారని మంత్రి ప్రకటించారు. 
 
సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంత మంది స్వచ్ఛంద సైనికులు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని, ఉద్యమ సమయం నుండి నేటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని వారంతా బలపరుస్తున్నారు అని మంత్రి కేటిఆర్ అన్నారు. 
 
గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఖండించడానికి టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న కృషి అనితర సాధ్యం అని కొనియాడారు.

పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుని ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేవిధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా పార్టీ టెక్ సెల్ ద్వారా చేపట్టాల్సిన పలు కార్యక్రమాలు పైన మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా కన్వీనర్ లకు పలు సూచనలు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో: విజయశాంతి