Publish Date: Sun, 13 Jun 2021 (17:16 IST)
Updated Date: Sun, 13 Jun 2021 (17:18 IST)
మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన అగ్రనేత నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామదాద గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఈ నెల 10వ తేదీన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మోహనరావు స్వస్ధలం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. 39 ఏండ్ల క్రితమే ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలిసింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్ రావు చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్నారు. ఇంటర్ మహబూబాబాద్, డిగ్రీ ఖమ్మం, పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
డబుల్ గోల్డ్ మెడల్ సాధించిన ఆయన... అన్న, అక్క, తమ్ముడు, చెల్లె ఉన్నారు. ఉద్యమంలో చేరిన తర్వాత 1985లో ఆయన ఖమ్మంలో అరెస్టు అయ్యారు. ఆరేళ్లు జైలు జీవితం గడిపారు. విడుదలై బయటకు వచ్చిన ఆయన మళ్లీ మవోయిస్టు ఉద్యమంలో కొనసాగారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నారు.
కాగా, మరణ వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మోహనరావు మృతి మవోయిస్టులకు తీరని లోటని… ఆయన భౌతిక కాయాన్నికుటుంబ సభ్యులకు అందించలేకపోయినందుకు చింతిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.