Publish Date: Wed, 31 Jul 2019 (08:09 IST)
Updated Date: Wed, 31 Jul 2019 (08:11 IST)
యాదాద్రిలో త్వరలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాగం నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామితో చర్చించారు. 100 ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు.
3000 మంది రుత్విక్కులు, మరో 3000 మంది వారి సహాయకులతో మహాయాగాన్ని గొప్పగా చేయాలని చర్చించారు. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను, భద్రినాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి లాంటి మహాకేత్రాల నుంచి మఠాధిపతులను, కేంద్రప్రభుత్వ పెద్దలను, అన్ని రాష్ట్రాల గవర్నర్లను, సీఎంలను, మంత్రులను, వివిధ సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించనున్నారు.
లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి విస్త్రతమైన ఏర్పాట్లు చేసే అంశంపై కూడా కేసీఆర్, చిన్న జీయర్ స్వామి మధ్య చర్చ జరిగింది.