Publish Date: Tue, 06 Jul 2021 (12:01 IST)
Updated Date: Tue, 06 Jul 2021 (12:05 IST)
హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్ ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ప్రజలకు వాడుకలోకి వచ్చింది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ను మూడు సంవత్సరాల 11 నెలల సమయంలో పూర్తి చేశారు. 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీ రోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్పల్లి-అమీర్పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.