Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫలించిన కేటీఆర్ కృషి : హైదరాబాద్ నగరంలో టీకా కేంద్రం

Advertiesment
Hyderabad
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. హైదరాబాద్ నగరంలో టీకా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సమ్మతించింది. హైదరాబాద్‌లో సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, సదానందగౌడకు ఈ ఏడాదిలోనే రెండుసార్లు లేఖలు రాశారు. సాధారణ టీకాలతోపాటు కరోనా టీకాల అభివృద్ధి, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ఈ ఏడాది చివరినాటికి సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్‌లోనే ఉత్పత్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌కు సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌ను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వసతులు కల్పించడంతోపాటు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. 
 
ఈ ఏడాది జనవరిలో మంత్రి కేటీఆర్‌ రాసిన లేఖ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికెళ్లింది. దీంతో తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలించి హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు సూచించారు. ఇవన్నీ ఫలించడంతో రెండుమూడు నెలల్లోగా జీనోమ్‌ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
 
అదేసమయంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ రాజధానిగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్‌లో ‘సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీ’ ప్రారంభంకానుంది. హైదరాబాద్‌తోపాటు పుణెలో ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తితోపాటు పరిశోధనలను పెంచేందుకు కేంద్ర బయోటెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. 
 
ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో మాత్రమే సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీ ఉంది. దేశవ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సిన్లను ఇక్కడే పరీక్షించి ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారైన వ్యాక్సిన్లను సైతం 1,800 కిలోమీటర్ల దూరంలోని కసౌలీకే పంపించాల్సి వస్తుంది. కరోనా టీకాల విషయంలోనూ అంతే. 
 
ప్రతి బ్యాచ్‌ టీకాలను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి విమానాల్లో పంపుతున్నారు. అక్కడి నుంచి వాటిని రోడ్డు మార్గం ద్వారా కసౌలీకి చేర్చేందుకు మూడు రోజులు, అక్కడ పరీక్షలు పూర్తయి అనుమతులు రావడానికి మరో 30-45 రోజులు పడుతున్నది. దీంతో అత్యంత విలువైన సమయం వృథా అవుతుందని, ఒక బ్యాచ్‌ టీకాలు ఉత్పత్తి అయిన తర్వాత మార్కెట్‌లోకి రావడానికి కనీసం 3-4 నెలలు పడుతుందని బయోటెక్‌ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్యలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయన్మార్‌లో ఉద్రిక్తత.. 25మంది మృతి.. 11 మందికి పైగా గాయాలు