Publish Date: Fri, 12 Feb 2021 (08:46 IST)
Updated Date: Fri, 12 Feb 2021 (08:47 IST)
హైదరాబాద్ నగరంలోని ఎస్సార్నగర్ ఠాణా పరిధిలోని బోరబండ ఇందిరానగర్ ఫేజ్-2లో ఓ దేవాలయం గదిలో బయటపడిన అస్థిపంజరం కేసులోని మిస్టరీ వీడిపోయింది. స్నేహితుడి భార్యపై మనసుపడిన మరో స్నేహితుడు.. తాను మనసుపడిన మహిళ భర్తను హత్య చేసినట్టు పోలీసులు కనుగొన్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్కతాకు చెందిన పలాష్ పాల్(43) అనే వ్యక్తి కార్పెంటర్ గత 2009లో నగరానికి వచ్చాడు. మొదటి భార్య మరణించగా రెండో వివాహం చేసుకున్నాడు. అదే రాష్ట్రం మిడ్నాపూర్కు చెందిన ప్లంబర్ కాంట్రాక్టర్ కమల్ మైతీ(50) తన కుటుంబంతో కలిసి రాజీవ్గాంధీనగర్లో నివసిస్తున్నాడు. వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు.
ఈ క్రమంలో కమల్ మైతీ భార్యపై పలాష్ పాల్ మనసుపారేసుకుని, ఆమెపై కన్నేశాడు. ఈ విషయం తెలిసిన కమల్.. అతన్ని మందలించాడు. దీంతో కక్ష పెంచుకుని సమయం కోసం ఎదురుచూడసాగాడు.
కమల్ను జనవరి 10న ఇందిరానగర్ ఫేజ్-2లోని గోదాంకు రప్పించిన పలాష్.. కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. దేవస్థాన నిర్వాహకులు దుకాణాన్ని ఖాళీ చేయిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడింది.
దీనిపై స్థానిక పోలీసులకు సమచారం అందించారు. వారు వచ్చి చెక్కపెట్టెను తీసి పరిశీలించగా, కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు.