Publish Date: Mon, 20 Jul 2020 (22:58 IST)
Updated Date: Mon, 20 Jul 2020 (23:00 IST)
శంషాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్య ఘటన మరవకముందే, అత్తమామ ఆడపడచులు పెట్టే భాధలు భరించలేక మరో వివాహిత బలవన్మరణం పొందింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడిశెరీఫ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ హర్షగుడా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
10 లక్షల కట్నం ఇచ్చి కూతురిని అత్తింటికి పంపితే, అత్త వారు పెట్టే భాధలు భరించలేక తన కూతురు తనువు చాలించిందని అమ్మాయి బంధువుల కన్నీటిపర్యంతమయ్యారు. వివరాలు పరిశీలిస్తే, ఎయిర్ పోర్ట్లో ప్రవేట్ ఉద్యోగం చేస్తున్న రమావత్ విరేష్ నాయక్కు రోజాను ఇచ్చి వివాహం జరిపించారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి.
తొలి కాన్పులో వీరికి కొడుకు పుట్టాడు. రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో భర్తతో సహా, అత్తింటి వారు కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు సరికదా ఇద్దరు ఆడపడుచులు వేధింపులు మొదలయ్యాయి.
వ్యాపారం కోసం రోజా దగ్గర ఉన్న పది తులాల బంగారం ఇవ్వమని విరేష్ నాయక్ అడగడంతో రోజా నిరాకరించింది. దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భాధలు భరించలేక ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రోజా. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి భర్త హత్య చేశాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు.