Publish Date: Wed, 06 Mar 2019 (17:41 IST)
Updated Date: Wed, 06 Mar 2019 (17:42 IST)
మద్యం తాగడానికి తనను పిలవలేదని అడిగిన స్నేహితుడితో ఇద్దరు గొడవపడి మరణానికి కారణమయ్యారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న అతను తోపులాటలో క్రింద పడటంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్షా (32), నితిన్రమేష్రావుపటేల్ (30) బ్రతుకు తెరువు కోసం నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చి హోటల్లో పనిచేస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్ హల్లీఖేడ్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌసుద్దీన్ (34) కూడా జీవనాధారం కోసం ఇటీవలే నగరానికి వలస వచ్చాడు. పారిశుధ్య పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్యాపిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి ముగ్గరికీ పరిచయం ఏర్పడింది. మహమ్మద్ గౌసుద్దీన్కి పనులు చేసేటప్పుడు కాలు విరిగి వాపు రావడంతో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా పనికి వెళ్లకుండా నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్ వద్ద కాలిబాటపై ఉంటున్నాడు.
సోమవారం మహమ్మద్షా, నితిన్ రమేష్రావు పటేల్లు మద్యం తాగి కాలిబాటపై కూర్చుని ఉన్న గౌసుద్దీన్ వద్దకు వచ్చారు. మద్యం సేవించడానికి తనను ఎందుకు పిలవలేదని, తను లేకుండా మద్యం ఎందుకు తాగారని గౌసుద్దీన్ వారిని నిలదీశాడు. ఈ వాగ్వివాదంలో తోపులాట జరిగింది. అనారోగ్యంతో ఉన్న గౌసుద్దీన్ వెనుక ఉన్న కాలిబాటపై పడి అక్కడికక్కడే మరణించాడు. ఎంతకూ చలనం లేకపోవడంతో అనుమానం వచ్చి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఆటో డ్రైవర్ వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.