Publish Date: Mon, 11 May 2020 (10:39 IST)
Updated Date: Mon, 11 May 2020 (10:41 IST)
దేశ వ్యాప్తంగా చిక్కెన్ ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీటి ధరలు మరింతగా మండిపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు చికెన్ అంటే భయపడిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది.
కరోనా వైరస్, బర్డ్ ఫ్లూ భయం కారణంగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. అలా నెల రోజులు పాటు కనిష్ట స్థాయికి పడిపోయిన చికెన్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఫలితంగా ఇపుడు చుక్కల్లో ఉంటున్నాయి.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.220కి చేరింది. లాక్డౌన్తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్ ముక్కలకు దూరమవుతున్నారు. ఆ డబ్బుతో కూరగాయలు కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతున్నారు.
కరోనా భయంతో నెల రోజుల క్రితం వంద రూపాయలకు మూడు కేజీల చికెన్ లభ్యమైంది. చెన్నై వంటి నగరాల్లో కేజీ చికెన్ కొంటే అర కేజీ చికెన్ ఫ్రీ అంటూ బోర్డులు కూడా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా కూడా ఇచ్చేశారు.
అయితే, గత కొన్ని రోజులుగా ఈ చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ ధరలు ఇదేవిధంగా ఉన్నాయి. చెన్నైలో కేజీ చికెన్ ధర రూ.240 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు.
కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు చికెన్ తినాలని అనుకుంటున్నారు. అయితే, ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడు చికెన్ కొనలేకపోతున్నాడు.
ఠాగూర్
Publish Date: Mon, 11 May 2020 (10:39 IST)
Updated Date: Mon, 11 May 2020 (10:41 IST)