Publish Date: Sun, 03 Jul 2022 (16:26 IST)
Updated Date: Sun, 03 Jul 2022 (16:36 IST)
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప పేరుతో ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ బహిరంగ సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జరిగే ప్రాంగణంతో పాటు నగరమంతా కాషాయమయమై పోయింది.
ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే నాంది పలకాలని, బీజేపీ సత్తా చాటాలని భావిస్తున్నారు. పైగా, ఈ బహిరంగలో పాల్గొనే ప్రధాని మోడీ అధిక సమయం అక్కడే వెచ్చించనున్నారు. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మరోవైపు, తొలి రోజు బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం రాత్రి 8.30 గంటలకు ముగిసింది. రాత్రి 9.30 గంటలకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, ఇతర నేతలు రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేశారు. ఈ నేపథ్యంలో హోటల్ చుట్టూత భారీ ఎత్తున పోలీసు బందోబస్తు మొహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను కల్పించారు.
ఇదిలావుండగా, బీజేపీ ప్రతిష్టాత్మకంగా జాతీయ కార్యవర్గ సమావేశంలో మధ్యలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా కూర్చొన్నారు. వారితో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఏర్పాట్లు అద్భుతంగా చేశారంటూ రాష్ట్ర నాయకత్వాన్ని కొనియాడారు.