Publish Date: Tue, 13 Sep 2022 (11:09 IST)
Updated Date: Tue, 13 Sep 2022 (12:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి తెరాస మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని మరమనిషి అని సంభోధించడంతో తెరాస సభ్యులు మండిపడ్డారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా ఈటల వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పి, ఆయన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, ఈటలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రటించారు.
తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభలో రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఈటల రాజేందర్ ఒక మర మనిషితో పోల్చారు. దీనికి తెరాస సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్కు ఈటల సారీ చెప్పాలని పట్టుబట్టారు. అందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు.
దీంతో స్పకర్ స్థానాన్ని అగౌరవపరిచినందుకు ఈటలను సబ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ సస్పెన్ష్ విధించారు.
ఈ సమావేశాలు ముగిసేంత వరకు ఈటలపై విధించిన సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈటలను సస్పెండ్ చేయడం పట్ల మిగిలిన భారతీయ జనతా పార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.