Publish Date: Sun, 27 Jun 2021 (13:44 IST)
Updated Date: Sun, 27 Jun 2021 (13:46 IST)
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తున్న కారు.. శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్న కోరుట్ల సమీపంలో ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు కడప జిల్లా పులివెందులకు చెందిన గంగాభవాని, ఆది నారాయణరెడ్డి, సుగుణ, శారద, అశోక్ రెడ్డిలుగా గుర్తించారు.
వీరంతా బంధువుల పెళ్ళికి హాజరై అనంతరం శ్రీశైలం దైవదర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.