Publish Date: Fri, 22 Jul 2022 (12:56 IST)
Updated Date: Fri, 22 Jul 2022 (12:57 IST)
స్మార్ట్ ఫోన్లు ప్రాణాలను మింగేస్తున్నాయి. మొబైల్ ఫోన్ వాడాల్సినంత అవసరం లేకపోయినప్పటికి చిన్నారులు గేమ్స్కు అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని టీనేజర్లు పట్టుబడుతున్నారు. ఫోన్ కొనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తాజాగా అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణం 9వ వార్డులో బానోతూ శివలోకేష్ అలియాస్ సోనూ అనే పదిహేనేళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని కొక్కానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
చనిపోయిన బాలుడు శివ లోకేష్ స్థానిక మాంటిసోరి స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడు శివలోకేష్ తండ్రిని సెల్ఫోన్ కొనివ్వమని గత కొద్దిరోజులుగా కోరుతున్నాడు. కొనివ్వలేదనే మనస్తాపంతోనే ఈ విధంగా ప్రాణాలు తీసుకున్నట్లుగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.