ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడనివ్వలేదన్న కారణంతో ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్న విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో నిన్న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేతి రిషేంద్ర అనే పదో తరగతి విద్యార్థి పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. రోజూ 10 గంటలకు పైగా ఆటలోనే మునిగిపోతూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు.
గేమ్ ఆడేందుకు సమయం సరిపోవడం లేదంటూ స్కూల్కు వెళ్లడం కూడా మానేశాడు. కొడుకు కోసం అతని తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా రిషేంద్ర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా, చికిత్స అందిస్తున్న వైద్యుడినే బెదిరించినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్ చూడకూడదని బలవంతం చేశారు. గేమ్ ఆడలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిషేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.