ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కుమార్తెకు వైద్యం చేయించలేక ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన పరశురాంకి ఒక కొడుకు-కూతురు వున్నారు.
రెండేళ్ల క్రితం పరశురాం కొడుకు సందీప్, కుమార్తె సింధు ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె సింధు కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకి గత రెండేళ్లుగా దాతల సాయంతో రూ. 30 లక్షల ఖర్చుతో చికిత్స చేయిస్తూ వచ్చాడు. ఐతే కుమార్తె ఆరోగ్య పరిస్థితి ఎంతమాత్రం మెరుగుపడలేదు.
ఆమెకి చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై మనస్థాపం చెందాడు. కన్నకుమార్తెకి వైద్యం చేయించలేని స్థితికి మనోవేదన చెంది ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పరశురాం. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.