Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

Advertiesment
jagan - singaiah

ఠాగూర్

, మంగళవారం, 1 జులై 2025 (12:37 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో చీలి సింగయ్య అనే వృద్ధుడు జగన్ కాన్వాయ్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సింగయ్యను తొక్కిన కారు జగన్మోహన్ రెడ్డి ఉన్న కారేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక వాస్తవాలను ధ్రువీకరించింది. 
 
ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న వైకాపా కార్యకర్తల సెల్ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. సింగయ్య మృతిపై వెలుగులోకి వచ్చినవి మార్ఫింగ్ వీడియోలంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సోమవారం పోలీసులకు అందిన ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది.
 
జూన్ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయారు. వైకాపా కార్యకర్తలు రోడ్డు పక్కకు లాగేసి వదిలేయడంతో ఆయన కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయారు. తొలుత వైకాపాకు చెందిన దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

అనంతరం జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు వెలుగుచూడడం సంచలనమైంది. పోలీసులు ఘటనా స్థలంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. ర్యాలీని చిత్రీకరించిన వైకాపా కార్యకర్తల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ఇప్పటివరకు 6 ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా.. అవన్నీ ఒరిజినలేనని స్పష్టమైంది. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ సమాచారం చేరవేసిన వారిపైనా అంతర్గత విచారణ జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...