మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. హైదరాబాద్ నగర వేదికగా ఈ పోటీలు జరగగా, శనివారంరాత్రి ఫైనల్ జరిగింది. ఈ అందాల పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన సక్సెస్ సీక్రెట్ను బహిర్గతం చేశారు. పట్టుదల, దృఢ నిశ్చయం అనేవే తన జీవితంలో కీలకమైన సూత్రాలన్నారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, కరుణ అనేవి తన వృత్తి జీవితానికి వెన్నెముక వంటివన్నారు.
అలాగే, ఎపుడూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మౌలిక విలువలకు కట్టుబడి ఉండండి. నా లక్ష్యాన్ని పట్టుకుని, నన్ను నేను నమ్ముకున్నందువల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా మర్చిపోవద్దు అని సుచాత హితవు పలికారు.
ఇది ఎపుడూ సులువుకాదు. కొన్నిసార్లు అలసటగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ మీరు ఎపుడూ వదిలిపెట్టకపోతే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడకి తప్పకుండా చేరుకుంటారు అని ఆమె వెల్లడించారు.
కాగా, ఈ పోటీల్లో రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హసెట్ అడ్మాసు నిలిచారు. కిరీట ధారణ వేడుక కోసం సుచాత, ఓపల్ రత్నాల వంటి పూలతో అలంకరించిన తెలుపు రంగు గౌను ధరించారు. ఈ గౌను హీలింగ్, బలానికి ప్రతీకగా నిలిచింది. కాగా, గత యేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా, కొత్త ప్రపంచ సుందరి ఓపల్ సుచాతకు కిరీటధారణ చేశారు.